రాష్ట్రంలో భూ వివాదాలన్నింటినీ పరిష్కరించేందుకు, భూ దందాలను అరికట్టేందుకు, ప్రభుత్వం పేదలకు పంచిన భూములు సక్రమంగా వినియోగంలోకి రావడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన విధానం, కార్యక్రమాలను రూపొందించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై గురువారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు.భూ వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక గందరగోళ అంశాలున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఒకే భూమి అనేకమంది పేర రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న వివరాలకు వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటున్నదని, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు ఎవరి కాస్తులో ఉన్నాయనే విషయంలో కూడా స్పష్టత లేదని సిఎం అన్నారు. దీనివల్ల భూ వివాదాలు ఎక్కువవుతున్నాయని, కోర్టుల్లో ఏండ్ల తరబడి కేసులు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ గందరగోళానికి తెరపడాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. ఎవరి పేరు మీద ఎంత భూమి ఉంది? ఆ భూమి ఎవరి కాస్తులో ఉంది? తదితర విషయాలపై స్పష్టత రావాలని చెప్పారు. సాదా బైనామాల మీద కొనసాగుతున్న భూములను హక్కు దారులు సత్వరం రిజిస్ట్రేషన్ చేయించుకుని, పేరు మార్పిడీ చేసుకునేలా ప్రోత్సహించాలని సిఎం అన్నారు. ప్రభుత్వం పంచిన అసైన్డ్ భూములు, సీలింగ్ భూములు, భూదాన్ భూముల విషయంలో కూడా స్పష్టత లేదని, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న దానికి భిన్నంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. భూ వివాదాలను పరిష్కరించడానికి, ప్రతీ ఎకరా భూమి రికార్డును సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన విధానం రూపొందించాలని చెప్పారు. ఈ విషయంలో సీనియర్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు. వరంగల్ కలెక్టర్ తో పాటు పెద్దపల్లి, సిద్ధిపేట ఆర్డీవోలతో కూడా సిఎం టెలిఫోన్ లో మాట్లాడి, వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భూ రికార్డులన్నీ ఒకసారి క్లీన్ అయిన తర్వాత వాటిని కంప్యూటరీకరించాలని, ఆన్ లైన్లో వివరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.పేదలకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం మరింత ముందుకు సాగేందుకు కూడా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని సిఎం అన్నారు. ఇప్పటి దాకా ఎవరెవరు ఎంత భూమి ప్రభుత్వం నుంచి పొందారు? మూడు ఎకరాలకు వారు పొందిన భూమి ఎంత తక్కువుంది? ఇంకా వారికి ఎంత భూమి ఇవ్వాలి? అనే విషయాలు తేలుతాయని సిఎం అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వారికి ముఖ్య ఆదాయ వనరు సమకూరుతుందని సిఎం అన్నారు. కమతాల ఏకీకరణ కోసం కూడా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో అర్బన్ లాండ్ సీలింగ్ వ్యవహారాలను కలెక్టర్లకు అప్పగించాలని సిఎం ఆదేశించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి