మెడిసిన్లో 40 సీట్లు, బిడిఎస్ లో 20 సీట్లు సాధించడంతో పాటు ఉన్నత విద్యకోసం జరిగిన అనేక పోటీ పరీక్షల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్య, భోజనం, వసతి, శిక్షణ అందించడంలో అంకితభావంతో కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ను అభినందించారు. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం తప్పక ఫలితం ఇస్తుందని నిరూపించారన్నారు. ఈ ఏడాది ఎంసెట్లో ఎస్సీ గురుకులాలకు చెందిన 40 మంది విద్యార్థులు ఎంబిబిఎస్ లో, 20 మంది విద్యార్థులు బిడిఎస్ లో ప్రవేశం పొందే విధంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఈ విద్యాలయాల నుంచి నలుగురైదుగురికి మించి ఎంపికైన సందర్బాలు లేవు. ఇవే విద్యాసంస్థల నుంచి 25 మంది విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీల్లో, ఆరుగురు టిఐఎస్ఎస్ లో, 11 మంది అజీంప్రేమ్ జీ సంస్థలో, 45 మంది ఐఐటిల్లో, నిట్ లో, ఐదుగురు సిఎ కోర్సులో ప్రవేశం పొందారు. ఎస్టీలకు చెందిన విద్యార్థులు కూడా 9 మంది మెడిసిన్లో, నలుగురు బిడిఎస్ లో, 50 మంది ఐఐటి, నిట్స్ లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇంత గొప్ప ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. విద్యార్థుల చదువు ప్రగతికి మార్గం వేస్తుందని నమ్మే ప్రభుత్వానికి ఈ పిల్లలు సాధించిన విజయం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల విద్యార్థులు సాధించిన విజయాలను చూసిన తర్వాతే మైనారిటీలకు కూడా పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సిఎం చెప్పారు. సమాజంలో అణగారిన వర్గాలకు మంచి విద్య అందించడానికి ప్రభుత్వం మరింత ఎక్కువ కార్యక్రమాలు తీసుకుంటుందని, ఈ విషయంలో ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని సిఎం చెప్పారు. విద్యార్థులు సాధించిన విజయానికి తాను ఎంతో సంతోషపడుతున్నానని, విద్యా సంస్థలను అంకితభావంతో నడుపుతున్నారని ప్రవీణ్ కుమార్ కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభినందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి