ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మత్కుణం కథ


ఒకసారి కృష్ణదేవరాయలవారి ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. ఆయనతో పాటు ఒక బండి నిండా పత్రాలు ఉన్నై. "సంస్కృతంలో నన్ను మించినవాడు లేడు. అనేక దేశాల సంస్కృత పండితులు నాతో ఓడి, నాకు ఈ విజయపత్రాలను అందించారు. మీ రాజ్యపు పండితులతో శాస్త్ర చర్చ చేద్దామని వచ్చాను. మీ రాజ్యంలో ఎవరైనా పండితుడన్నవాడు ఉంటే నాతో తలపడమనండి. లేదూ, వారెవ్వరూ నాతో శాస్త్ర చర్చకు ముందుకు రాలేమంటే, మరి విజయపత్రాలను ఇప్పించండి" అన్నాడు గొప్పగా.

రాయలవారు సభలోని కవుల కేసి చూసారు. వాళ్లంతా కొంచెం ఇరుకున పడ్డారు. ఏమంటే "ఆస్థానంలో ఉన్న సంస్కృత పండితులు అందరూ ఆ సమయానికి వేరే దేశానికి వెళ్ళి ఉన్నారు- రాజ్యంలో ఉన్నదల్లా తెలుగు కవులు మాత్రమే. ఈ సంస్కృత కవి తీరు చూస్తే మామూలు వాడిలాగా లేడు. ఊరికే చర్చించేదెందుకు, ఓడేదెందుకు, రాజ్యాన్నంతా ఓటమి పాలు చేసిన అపకీర్తిని మూటగట్టుకునేదెందుకు?"

రాయలవారు వారి సంశయాన్ని గుర్తించారు. సభలో కూర్చున్న తెనాలి రామకృష్ణుడికేసి చూసారు. రామకృష్ణుడు ఇకిలించాడు. రాయలవారు తల పంకించారు. "అయ్యా! పండితులవారూ! మా సంస్కృత కవులందరూ విదేశ యాత్రలో ఉన్నారు. వారి శిష్యులైన పామరులు మాత్రం కొందరు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. తమరి రాకను వారికి తెలియజేస్తాం. రేపు మధ్యాహ్నంగా శాస్త్రచర్చ ఏర్పాటు చేసుకుందాం. అంతవరకూ తమరు మా ఆతిథ్యం స్వీకరించండి" అని పండితులవారికి తుంగభద్రా నదీ తీరాన వున్న ఒక భవంతిలో విడిది ఏర్పాటు చేసారు.

పండితులవారు అటు పోగానే ఇటు రాయలవారు "రామకృష్ణా!" అన్నారు.

"ప్రభువులవారు ఈ పని నాకు వదిలెయ్యండి!" అన్నాడు రామకృష్ణుడు నవ్వుతూ.మరునాడు తెల్లవారే సరికి రామకృష్ణుడు చాకలివాడి వేషం వేసుకున్నాడు. తన భార్యకు చాకలమ్మ వేషం వేసాడు. ఏం చెయ్యాలో అంతా ఆమెకు చెప్పి వుంచాడు. ఓ బట్టల మూటనెత్తుకొని తను తుంగభద్రా నదీ తీరం చేరుకున్నాడు. నదిలో బట్టలు ఉతుకుతున్నట్లు నటించటం మొదలు పెట్టాడు.

అనుకున్నట్లే ఆ రేవు దగ్గరికి వచ్చాడు సంస్కృత పండితుడు. నదిలోకి దిగి స్నానం చేస్తున్నాడు. చాకలి ఆయన తీరును చూస్తూ తన జోరు పెంచాడు.

అంతలోకే చాకలమ్మ వచ్చింది మరో చిన్న బట్టల మూట పట్టుకొని. రామకృష్ణుడిని అడిగింది గట్టిగా, దగ్గర్లోనే ఉన్న పండితుడికి వినబడేట్లు- "యివ్వాళ అన్నం లోకి సాధకం ఏమి చెయ్య మంటావు మామా ?" అని.

చాకలివాడు కొంచెం ఆలోచించాడు:

"మత్కుణం నది సంయుక్తం, విచార ఫల మేవచ, గోపత్నీ సమాయుక్తం,

గ్రామచూర్ణం చ వ్యంజనం" అని జవాబి-చ్చాడు.

ఆమె కనబడీ కనబడనట్లు నవ్వింది. "సరే అలాగే- 'తథైవ అస్తు' " అని చెప్పి, ఉతికిన బట్టలు పట్టుకొని వెళ్ళిపోయింది.

నదిలో సంధ్యావందనం చేసుకుంటున్న పండితుడికి తల తిరిగినట్లైంది. "ఈ దేశంలో ఒక సాధారణ చాకలి, చాకలమ్మ సంస్కృతంలో మాట్లాడుకున్నారు! ఇంతగొప్ప సంస్కృత పండితుడైన తనకు ఆ శ్లోకం అర్థం కాలేదు!"

"ఇంతకీ 'మత్కుణం' అంటే ఏంటి? 'మత్కుణం' అంటే సంస్కృతంలో 'నల్లి' అని అర్థం.

'నది సంయుక్తం' అంటే 'నదితో కలిసినది'- నల్లి నదితో కలవటమేమిటి? తెలీదు!

"విచార ఫలం" అన్నాడు- విచారిస్తే ఫలితం ఏముంటుంది? కన్నీళ్ళు వస్తాయి.. అయితేనేమి?

ఇక "గో పత్ని- ఆవు భార్య" అంటున్నాడు. ఆవే ఆడది కదా, ఇక ఆవుకు భార్య ఎక్కడినుండి వస్తుంది?

అంతా చేసి "గ్రామ చూర్ణం" కావా-లంటున్నాడు! అదేంటి?

"పోనీ 'దీనికంతా అర్థం లేదు' అనుకుందామంటే అట్లానూ లేదే, చాకలమ్మ "సరే సరే" అని పోయింది. అంటే ఆమెకు అర్థమైనట్లే కదా!" ఆలోచించీ ఆలోచించీ అతనికి మతి పోయింది-

"ఈ రాజ్యపు చాకలివాడి శ్లోకమే తనకు అర్థం కాలేదు- చాకలమ్మకు అర్థమయినంత నాకు అర్థం కాలేదు. యింక రాజుగారి దగ్గర పనిచేసే పండితులతో నేనెక్కడ గెలువగలను?" అనుకున్నాడాయన. రామకృష్ణుడు చూస్తుండగానే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా బయలుదేరి భవనానికి వెళ్లి, మూటా ముల్లె సర్దుకొని, నగరం విడిచి పారిపోయాడు.

మరునాడు సభలో రాయలవారు అడిగారు- "ఏడీ! పండితుడు?!" అని."విడిది పరిసరాల్లో ఎక్కడా లేడు" చెప్పారు భటులు. "వేరే నగరానికి వెళ్తున్నానని చెప్పి ఉదయాన్నే వెళ్ళాడాయన!" వింటున్న రామకృష్ణుడు నవ్వాడు. రాయలవారు "నువ్వే ఏదో చేసినట్లున్నావు

?!" అన్నారు మర్మగర్భంగా

"లేదు- నేను కాదు, ఇదంతా చేసింది మత్కుణం" అని కథంతా చెప్పాడు రామకృష్ణుడు.

రాయలవారు నవ్వి, ఇంతకీ ఈ శ్లోకం మాక్కూడా అర్థం కాలేదు- ఏంటి, దీని కథ?" అన్నారు.

అప్పుడు రామకృష్ణుడు ఇలా అర్థం చెప్పాడు:

"మత్కుణం అంటే నల్లి; నది అంటే ఏరు. నల్లి, ఏరు కలిసి 'నల్లేరు' అయ్యింది.

విచారం అంటే చింత; ఫలం అంటే పండు- కలిసి చింతపండు అయ్యింది.

గోవు అంటే ఆవు; పత్ని అంటే భార్య- ఆలు. ఆవు,ఆలు కలిస్తే అయ్యేవి ఆవాలు-"

రాయలవారు కడుపుబ్బా నవ్వారు. మరి ఇంతకీ గ్రామచూర్ణం ఎలా చేస్తారు? అన్నారు.

ఏమీ లేదు- గ్రామం అంటే ఊరు; చూర్ణం అంటే పిండి- వెరసి 'ఊరుబిండి' అవుతుంది ప్రభూ. మన సీమలో అందరికీ ఇష్టమైన పచ్చడి కదా అది?" అన్నాడు రామకృష్ణుడు కొంటెగా.

"నల్లేరు, ఆవాలు, చింతపండు కలిపి చేసే వూరుపిండి సంస్కృత పండితుడినే భయపెట్టిందే, అంతగొప్ప పండితుడు పలాయనం చిత్తగించేట్లు చేసింది ఇది మామూలుది కాదు"

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు