కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై బిజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. అభివృద్ధిలో పోటీ పడాలని, అబద్ధాలాడటంలో కాదని చురకలు అంటించారాయన. కాంగ్రెస్ చేసిన పాలనా తప్పిదాలను సరిదిద్దడానికి తమకు చాలా కాలం పట్టిందని వ్యాఖ్యానించారు మోడీ.బిజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ను మాటలతో కడిగేశారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి. అబద్ధాలతో ఎన్నాళ్లు మోసగిస్తారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ లో ఏర్పాటైన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ..ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అబద్ధాల కోరులుగా అభివర్ణించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రి. శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో మధ్య ప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను సరిచేసేందుకు బిజేపీ సర్కారుకు చాలా కాలం పట్టిందని చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. మధ్యప్రదేశ్ లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, యాభై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఇంకా పాఠశాలలకు, రహదారి సౌకర్యాలకు నోచుకోని గ్రామాలున్నాయని నరేంద్ర మోడీ విమర్శించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి