ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ కొత్త జిల్లాల కూర్పు


రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఆన్ లైన్లో, ప్రత్యక్షంగా ప్రజల నుంచి పలు సూచనలు, అభ్యంతరాలు, సలహాలు కూడా వస్తున్నాయని, వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. దసరా నుంచే కొత్త జిల్లాలతో పాటు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కూడా ప్రారంభం కావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి సంబంధించిన పాలనా విభాగాల కూర్పు వేగవంతం కావాలని సిఎం ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఏ విభాగానికి ఎక్కువ పని ఉంది, క్షేత్ర స్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఎక్కడ ఉంది అనే విషయాలను పరిగణలోకి తీసుకుని కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రస్తుతమున్న పరిపాలనా విభాగాలను యధావిధిగా కొనసాగించాలా? ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా? అనే విషయంపై కూడా అధికారులు సూచనలు చేయాలని చెప్పారు. మంత్రులు, శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు సమావేశమై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలోని టాస్క్ పోర్స్ కమిటీ పరిశీలిస్తుందని, తర్వాత కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై పాలనా విభాగాల కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. తెలంగాణలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాడర్ మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నందున, ప్రస్తుతం జోనల్ అధికారులకు అన్యాయం జరగకుండా వారిని పోస్టుల్లో సర్దుబాటు చేయాలని కోరారు. అధికారులను జిల్లాలకు కేటాయించే క్రమంలో వారి సదరు ఉద్యోగి ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారుల కూర్పులో కూడా కొత్త పద్ధతి అవలంభించాలని చెప్పారు. ప్రతీ శాఖకు ఓ జిల్లా అధికారి హోదా గల అధికారి ఉండాలని చెప్పారు. నీటి పారుదల శాఖకు నీటి పారుదల అభివృద్ధి అధికారి, ఆర్ అండ్ బికి రహదారుల అభివృద్ధి అధికారి... ఇలా ప్రతీ శాఖకు ఓ జిల్లా అధికారి ఉండాలని చెప్పారు. జిల్లా అధికారులుగా నియమించే వారికి అధికారాల బదలాయింపు జరగాలని చెప్పారు. వ్యవసాయం, వైద్యం, విద్య తదితర విభాగాల విషయాల్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాల ప్రాధాన్యతతో ఉద్యోగుల సర్దుబాటు జరగాలన్నారు. సూపర్ వైజరీ పోస్టులకన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులే ఎక్కువ అవసరం కాబట్టి, మండల స్థాయి అధికారులు, సిబ్బంది నియమకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఒకే రకమైన పనితీరు కలిగిన విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే అధికారిని నియమించడం సబబుగా ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
కొత్త జిల్లాలకు అవసరమైనంత మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి శాఖలవారీగా, జిల్లాల వారీగా ప్రతిపాదనలు రూపొందించాలని సిఎం ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా విభాగాలు ఎలా ఉండాలనే విషయంపై అన్ని ప్రభుత్వ శాఖలు రెండు రోజుల్లో తమ ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాలని సూచించారు. కొత్త జిల్లాల్లో పని విభజన, కొత్త ఉద్యోగుల నియామకం, పరిపాలనా విభాగాల ఏర్పాటు తదితర అంశాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నాయకత్వంలో టాస్క్ ఫోర్సును కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు.


జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిపాలన విభాగాల కూర్పును పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో టాస్క్ ఫోర్సు కమిటీ వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సి.సి.ఎల్.ఎ. రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, వరంగల్, మెదక్ కలెక్టర్లు కరుణ, రోనాల్డ్ రాస్, సిఎంఓ అధికారులు శాంతికుమారి, స్మితా సభర్వాల్ కమిటీ సభ్యులుగా ఉంటారు. మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ అధికారులను కూడా కమిటీలో నియమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు