రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఉనికికే ప్రశ్నార్థకంగా మారింది. వ్యక్తిగతంగా 80 శాతం మంది నేతలు రాష్ట్ర సమైక్యతనే కోరుకుంటున్నా... కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం ఈ నేతలకు శాపంగా మారింది. కొందరు ముఖ్యనేతలతో ముందుగానే ఒక ఒప్పందంతో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అదే ఇప్పడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరికీ శాపంగా మారింది. పార్టీలో ఉన్నందుకు తమ వ్యక్తగత నిర్ణయం కాకపోయినా... తాము విభజనలో బాధ్యులుగా మారి తమ వ్యక్తిగత భవిష్యత్తును కోల్పోవాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ హై కమాండ్ కల్పించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేయని పనికి తాము ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నిస్తున్నారు.విభజనపై అధిష్టానం దూకుడు పెంచడంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిపోగా, వైసీపీ, టీడీపీ పుంజుకుంటున్నాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న తమకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం దారుణమంటున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు. అటు పార్టీలో కొనసాగలేక..ఇతర పార్టీల్లోకి వెళ్లలేక సతమతమవుతున్నారు. సీమాంధ్రలో పార్టీ చతికిలపడటంతో తీవ్ర ఒత్తిళ్లకు లోనవడంతోనే హైకమాండ్ పై ధిక్కారస్వరం పెంచారు. మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఎంపీ లగడపాట రాజగోపాల్ ... ఏకంగా కాంగ్రెస్ అధిష్టానం జగన్ తో కుమ్మకు అయ్యిందని ఆరోపించారు. హస్తినలో అధికారం కోసం సొంత పార్టీనే నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు వారు. పార్టీ పై ధిక్కార స్వరం వినిపించడం ద్వారా ... పార్టీ సీరియస్ అయి ... వేటు వేస్తే... ప్రజల్ల్లోకి వెళ్లవచ్చనే ఆలోచనతోనే నేతలు ఇలా మాట్లాడుతున్నారనే వాదన ఉంది. ఇప్పటికిప్పుడు రాజకీయ లబ్ధి పొందకపోయినా... విభజనకు వ్యతిరేకమన్న భావనను ప్రజల్లో పాదుకొల్పి భవిషత్తులోనైనా లబ్ది పొందవచ్చనేది సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అంచనా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి