చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్న ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో నగరానికి సమీపంలో ఉన్న ఊళ్లకు తిప్పే బస్సులను బుధవారం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్లో సిటీ బస్సులకు అనుమతి లేకపోవటంతో జిల్లా సర్వీసులను తిప్పుతున్న సంగతి తెలిసిందే. నగరానికి చేరువగా ఉన్న గ్రామాలకు సిటీ డిపోల నుంచి తిరిగే బస్సులను కూడా జిల్లా సర్వీసులుగానే పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి తిప్పటం ప్రారంభించారు. నగరంలోని 18డిపోల నుంచి 230 సర్వీసులు ప్రారంభించారు. నగరానికి 50 నుంచి 60 కి.మీ. పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇవి తిరుగుతాయి. సిటీలో తిరగవు. వీటి రూపంలో రోజుకు రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లా సర్వీసుల ద్వారా వస్తున్న రూ.4 కోట్ల రోజువారీ ఆదాయానికి ఇది తోడై కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక సిటీ బస్సులు నడపాలా వద్దా అన్న నిర్ణయం ముఖ్యమంత్రి పరిధిలో ఉంది. ఆయన ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి